న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్ రెండు డోసులతో అధిక రోగనిరోధక ప్రతిస్పందనను గుర్తించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. బీటా, డెల్టా, ఒమిక్రాన్ వంటి ఆందోళకర వేరియంట్లను ఎదుర్కోవడంలో ఈ టీకా ద్వారా పురోగతిని సాధించినట్లు ఒక అధ్యయనంలో పేర్కొంది. కొవాగ్జిన్ టీకా వల్ల లభించిన గణనీయమైన రోగనిరోధక శక్తి, కరోనా నుంచి కోలుకున్న వారిలో కూడా గుర్తించినట్లు తెలిపింది. అయితే కొవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో, రెండో డోసు తీసుకున్న మూడు నెలల తర్వాత రోగనిరోధక శక్తి తగ్గుదల చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయంలో పరిశీలించినట్లు పేర్కొంది.
కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ లేదా ప్రికాషనరీ డోసు ప్రాముఖ్యత ఈ అధ్యయనం ముఖ్య ఉద్దేశమని ప్రధాన పరిశోధకురాలు డాక్టర్ ప్రజ్ఞా యాదవ్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో థర్డ్ వేవ్ అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ అధ్యయనం నిర్వహించినట్లు చెప్పారు. దేశంలో కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కరోనా వేరియంట్లపై కొవాగ్జిన్ సమర్థతను పరిశీలించేందుకు ఈ స్టడీ చేపట్టినట్లు వివరించారు.
అయితే ఒమిక్రాన్కు వ్యతిరేకంగా రోగనిరోధక ప్రతిస్పందన తక్కువగా ఉన్నప్పటికీ, తీవ్రమైన వ్యాధికి గురిచేయడం, ఆసుపత్రిలో చేరడంతోపాటు మరణాల నుంచి వ్యక్తులను ఇది కాపాడిందన్నారు. ఈ అధ్యయనం ఫలితాలను ఈ నెల 5న జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో ప్రచురించినట్లు వెల్లడించారు.