బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్కు హైకోర్టులో గురువారం చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దర్యాప్తు చాలా వరకు పూర్తయినందువల్ల ఈ దశలో జోక్యం చేసుకోబోమని తెలిపింది.
దర్యాప్తును పూర్తి చేసి, మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. 2013-18 మధ్య కాలంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో డీకే శివకుమార్ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఆయన వెల్లడించిన ఆదాయ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఆస్తులను పోగేశారని సీబీఐ ఆరోపించింది. 2020 సెప్టెంబరు 3న ఎఫ్ఐఆర్ దాఖలైంది.