చండీగఢ్ : నెల రోజుల పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చింది నిజమైనా గుర్మీత్ రామ్ రహీమేనా? నకిలీయా? తేల్చాలంటూ దాఖలైన పిటిషన్ను పంజాబ్ – హర్యానా హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. కరోనా సమయంలో ఓ కల్పిత సినిమా చూసివచ్చినట్లుగా అనిపిస్తోందంటూ మందలించింది. రామ్ రహీమ్ను హర్యానా పోలీసులు అరెస్టు చేశారని చండీగఢ్కు చెందిన అశోక్ కుమార్తో పాటు పలువురు పిటిషన్లో హైకోర్టుకు తెలిపారు.
ఆ తర్వాత పెరోల్పై బయటకు వచ్చే సరికి రామ్ రహీమ్లో తేడాలు వచ్చాయని పేర్కొన్నారు. సమావేశాల్లో ఆయన సన్నిహితులను కూడా గుర్తించడం లేదని, దీంతో పాటు శరీరంలో సైతం చాలా తేడాలు కనిపిస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒక ఇంచు వరకు ఎత్తు పెరిగిందని, 50 ఏళ్లు వయసులో ఎవరి ఎత్తు పెరుగదని, ఈ వయసులో అతని వేళ్లు పొడువయ్యాయన్నారు. ఈ విషయంపై స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయాలంటూ పిటిషనర్ కోర్టును కోరారు.
విచారణ సందర్భంగా పిటిషనర్ను కోర్టు మందలించింది. ‘సినిమా చూసి వచ్చినట్లుగా అనిపిస్తుంది’ అని కోర్టు పేర్కొంది. పిటిషనర్ తరఫు న్యాయవాదిని సైతం మందలించింది. పిటిషనర్కు బుద్ధి చెప్పాలంటూ సూచించింది. ఈ సందర్భంగా రామ్ రహీమ్ పొడువు పెరిగితే.. పిటిషనర్కు దానితో సంబంధం ఏంటని కోర్టు ప్రశ్నించింది. పిటిషనర్కు జరిమానా విధించేందుకు కోర్టు సిద్ధమైనా.. చివరకు జరిమానా విధించకుండా పిటిషన్ను కొట్టివేసింది.
అయితే, పిటిషన్పై డేరా తరఫున న్యాయవాది జితేంద్ర ఖురానా మాట్లాడు కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పిటషన్లు దాఖలు చేస్తున్నారని, 2019లో సైతం ఇలాంటి పిటిషన్ దాఖలైందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. 2002లో మేనేజర్ను హత్య చేసిన కేసులో రామ్ రహీమ్ సింగ్ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.