High alert : భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నప్పటికీ దేశంలోని అన్ని ఓడరేవుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఒడిశా (Odisha) లోని పారదీప్ పోర్టు (Paradeep port) కు వచ్చిన ఓ ఓడ కలకలం రేపింది. ఆ ఓడలో 21 మంది పాకిస్థానీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో కలకలం రేగింది. దాంతో ఆ పోర్టు భద్రతను మరింత పెంచారు. ఆ ప్రాంతంలో వెంటనే హై అలర్ట్ (High alert) ప్రకటించారు.
బుధవారం ఉదయం దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా ఓ నౌక పారదీప్ పోర్టుకు చేరింది. ‘ఎమ్టీ సైరెన్ II’ పేరుతో ఉన్న ఈ షిప్లో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. ఈ షిప్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ కోసం ముడి చమురును తీసుకొచ్చింది. ఈ సందర్భంగా తనిఖీలు చేపట్టగా ఆ నౌకలోని సిబ్బందిలో 21 మందిని పాకిస్థానీలుగా గుర్తించారు. ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి దీని గురించి సమాచారం అందడంతో వెంటనే ఒడిశా మెరైన్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
పోర్టులో భద్రతను మరింత పెంచినట్లు మెరైన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ బబితా దుహేరి తెలిపారు. ఓడరేవు ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ నౌక పోర్టుకు 20 కిలోమీటర్ల దూరంలోని ‘పీఎం బెర్త్’ వద్ద లంగర్ వేసి ఉంది. ఇందులో 11,350 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముడి చమురు అన్లోడింగ్ పూర్తయ్యేవరకు 25 మంది సిబ్బంది నౌక నుంచి బయటికి రాకుండా భద్రతాఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.