న్యూఢిల్లీ : లక్షద్వీప్ తీరంలో పెద్ద ఎత్తున హెరాయిన్ను డీఆర్ఐ, ఇండియన్ కోస్ట్గార్డ్ అధికారులు పట్టుకున్నారు. 218 కిలోల హై గ్రేడ్ హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.1,526 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెనెన్స్ (DRI), ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) ‘ఖోజ్బీన్’ పేరిట సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. తమిళనాడు తీరం నుంచి పెద్ద ఎత్తున రెండు భారీ భారతీయ పడవల్లో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారనే సమాచారం మేరకు ఇటీవల నిఘాను పెంచారు.
ఈ క్రమంలో ఈ నెల 18న రెండు అనుమానిత పడవలను గుర్తించి, వాటిని అడ్డుకున్నారు. ఆ తర్వాత బోట్లలో సోదాలు నిర్వహించగా.. భారీ ఎత్తున హెరాయిన్ ప్యాకెట్లు లభమయ్యాయి. ఆ తర్వాత రెండు బోట్లను కొచ్చికి తరలించి క్షుణ్ణంగా అధికారులు తనిఖీ చేశారు. ప్రస్తుతం అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఏప్రిల్ 2021 నుంచి అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.26వేలకోట్ల విలువైన 3800 కిలోలకుపైగా హెరాయిన్ను డీఆర్ఐ స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ కోస్ట్గార్డ్ గత మూడు సంవత్సరాల్లో రూ.6200కోట్ల విలువైన మాదకద్రవ్యాలను రికవరీ చేసింది.