Hero Siddharth | బొమ్మరిల్లు ఫేం సిద్దార్థ్కు మధురై ఎయిర్పోర్టులో అవమానం జరిగింది. తల్లిదండ్రులతో కలిసి విమానం దిగి వస్తుండగా అడ్డుకున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది.. అకారణంగా వారిని హిందీలో దుర్భాషలాడారు. ఇంగ్లిష్లో మాట్లాడాలని ఎంతగా వేడుకున్నా కనకరించలేదు. ఈ ఘటనపై విమానాశ్రయంలో అధికారులకు సిద్దార్థ్ ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అవమానాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా బహిర్గతపరిచారు.
మంగళవారం మధ్యాహ్నం మధురై ఎయిర్పోర్టులో నటుడు సిద్దార్థ్ను సీఆర్పీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆయన వెంట వృద్ధ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పెద్ద వయసు తల్లిదండ్రుల జేబులు, సంచుల్లో నుంచి నగదును తీయాలని ఆర్డర్ వేశారు. హిందీలో మాట్లాడుతూ అసహనం కలిగేలా ప్రవర్తించారు. అధికారులు పదే పదే హిందీలో మాట్లాడటంతో ఇంగ్లిష్లో మాట్లాడాలని కోరినప్పటికీ నిరాకరించారు.
20 నిమిషాల పాటు తన తల్లిదండ్రులను సీఆర్పీ సిబ్బంది అవమానించారని, తనను కూడా వేధింపులకు గురిచేశారని సిద్దార్థ్ సోషల్ మీడియా వేదికపై ఆరోపించారు. ఎయిర్పోర్టులో విధుల్లో ఉన్న సీఆర్పీ సిబ్బంది.. ఎలాంటి పనిలేకుండా తమపై అధికారాన్ని ప్రదర్శించారని తనకు అనిపించిందని సిద్దార్థ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని విమానాశ్రయంలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు సిద్దార్థ్ తెలిపారు.