రాంచీ, ఆగస్టు 27: జార్ఖండ్లో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతున్నది. మైనింగ్ లీజు వ్యవహారంలో సీఎం హేమంత్ సొరేన్ శాసనసభ అభ్యర్థిత్వం రద్దు చేయాలంటూ ఈసీ చేసిన సిఫారసుపై గవర్నర్ రమేశ్ బాయిస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందన్న అనుమానాలతో వారిని కాపాడుకునేందుకు అధికార జేఎంఎం-కాంగ్రెస్ కూటమి చర్యలు చేపట్టింది.
ఉద యం జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పలుమార్లు భేటీ అయిన సీఎం.. అనంతరం మధ్యాహ్నం ఎమ్మెల్యేలను 3 బస్సుల్లో రాజధాని రాంచీ సమీపంలోని లత్రాతు డ్యాం వద్దకు విహార యాత్ర కు తీసుకెళ్లారు. తిరిగి రాత్రికి రాంచీకి చేరుకున్నారు. సీఎం సొరేన్తో పాటు ఎమ్మెల్యేలు కొంతసేపు బోటింగ్ చేసి షికారు చేశారు. అవసరం అయితే ఎమ్మెల్యేలను బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న బెంగాల్ లేదా ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు తరలించేందుకు సీఎం సొరేన్ యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.