Hemant Soren | రాంచీ, జనవరి 31: జార్ఖండ్ రాజకీయాల్లో సంచలనం. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. పలు నాటకీయ పరిణామాల మధ్య బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సొరేన్ విచారించిన ఈడీ.. అనంతరం అదుపులోకి తీసుకున్నది. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సొరేన్ సమాధానం దాటవేస్తున్న క్రమంలో మనీలాండరింగ్ నియంత్రణ చట్టం(పీఎంఎల్ఏ) కింద ఆయన్ను కస్టడీలోకి తీసుకొన్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. హేమంత్ సొరేన్ను ఈడీ గురువారం స్థానిక ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టి, కస్టడీ విచారణకు రిమాండ్ కోరే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అరెస్టుకు ముందే ముఖ్యమంత్రి పదవికి సొరేన్ రాజీనామా చేశారు. కొత్త సీఎంగా జేఎంఎం సీనియర్ నేత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న చంపై సొరేన్ను అధికార పక్షం ప్రతిపాదించింది. హేమంత్ సొరేన్ రాజీనామా అనంతరం చంపై సొరేన్ నేతృత్వంలోని అధికారపక్ష ఎమ్మెల్యేలు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను సాయంత్రం కలిశారు. తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు గవర్నర్ ఆమోదం తెలిపారని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. సొరేన్ అరెస్టుకు నిరసనగా ఆదివాసీ సంఘాలు గురువారం జార్ఖండ్ బంద్కు పిలుపునిచ్చాయి. అరెస్టును వ్యతిరేకిస్తూ సొరేన్ హైకోర్టును ఆశ్రయించారు.
రాజీనామా చేసిన తర్వాతనే అరెస్టు మెమోపై సంతకం చేస్తానని హేమంత్ సొరేన్ ఈడీ అధికారులకు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. దీంతో ఈడీ అధికారులు ఆయన్ను గవర్నర్ వద్దకు తీసుకెళ్లారు.
ఈడీ హేమంత్ సొరేన్ను అరెస్టు చేసే పక్షంలో ఆయన భార్య కల్పనా సొరేన్కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సాగింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్లో జరుగునుండటం.. సమయం ఎక్కువగా లేకపోవడంతో పార్టీ ఆ ఆలోచనను విరమించుకొన్నట్టు తెలిసింది. కల్పనా సొరేన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా లేరు. రాష్ట్ర అసెంబ్లీ టర్మ్ చివరి ఏడాదిలో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు వీలులేనందున.. ఒకవేళ ఆమెను కొత్త సీఎంగా ప్రతిపాదించినా, ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు అవకాశం ఉండదు. మరోవైపు కల్పానా సొరేన్ను సీఎం చేసే ఆలోచనను కూడా జేఎంఎం అధినేత శిబు సొరేన్ పెద్ద కోడలు, గత 14 ఏండ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సీతా సొరేన్ వ్యతిరేకించారు.
జార్ఖండ్లో రూ.600 కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తున్నది. ఓ ప్రభుత్వ భూమి యాజమాన్యాన్ని మార్చి, ల్యాండ్ మాఫియాకు అమ్మేందుకు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మంది అరెస్టు అయ్యారు.
ఢిల్లీలోని తన నివాసంలో సోమవారం ఈడీ సోదాలు చేయడంపై హేమంత్ సొరేన్ పోలీసులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. దర్యాప్తు సంస్థ అధికారులపై ఆయన రాంచీలోని పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు. సొరేన్ ఫిర్యాదు మేరకు కొంత మంది ఈడీ సీనియర్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని రాంచీ సీనియర్ ఎస్పీ చందన్ కుమార్ సిన్హా తెలిపారు. తనను వేధించడంతో పాటు తనను, తన కమ్యూనిటీ మొత్తాన్ని అవమానించేందుకు, అపఖ్యాతి పాల్జేసేందుకు ఈడీ ఈ సోదాలు చేపట్టిందని సొరేన్ ఆరోపించారు. అధికారుల చర్యల వలన తాను, తన కుటుంబసభ్యులు మానసిక క్షోభను అనుభవించామని సొరేన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో సోదాల సందర్భంగా ఈడీ అధికారులు సీజ్ చేసిన కారు, స్వాధీనం చేసుకొన్న నగదు తనది కాదని అందులో చెప్పారు.