Opposition CMs on IAS Rules | ఐఏఎస్ అధికారుల డిప్యూటేషన్పై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత సవరణకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు గళం విప్పుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అభీష్టంతో సంబంధం లేకుండా ఐఏఎస్ల డిప్యూటేషన్ నియమించుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దఖలు పర్చాలని ఆ ప్రతిపాదన సారాంశం. దీనికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అందరూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ కూడా రాశారు.
ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇది సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకం అని పేర్కొన్నారు. అఖిల భారత సర్వీసుల కేడర్ నిబంధనలను సవరణలు ప్రతిపాదించడానికి వ్యతిరేకంగా తన అభ్యంతరం వ్యక్తం చేశారు హేమంత్ సోరెన్. భారత్ ఐక్యతను బలహీన పరుస్తుందని పేర్కొంటూ ప్రధాని మోదీకి సోరెన్ లేఖ రాశారు. ఆ లేఖను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు.
రాష్ట్రాల అభీష్ఠానికి భిన్నంగా ఐఏఎస్ అధికారుల డిప్యూటేషన్ను కేంద్రం ఖరారు చేస్తే రాజకీయంగా దుర్వినియోగం అవుతుందని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్ ఆరోపించారు. ఒక రాష్ట్ర అధికారిని.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి లేకుండా నియమించడం ఏకపక్ష నిర్ణయం అవుతుందని పేర్కొంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రం ప్రతిపాదన రాజ్యాంగం కల్పించిన సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం అని వ్యాఖ్యానించారు.
కేంద్రం ప్రతిపాదించిన సవరణ అమల్లోకి వస్తే ఏ ఐఏఎస్ అధికారి కూడా సమగ్రతతో పని చేయలేడని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యంగం కల్పించిన సరిహద్దులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. 1954-ఐఏఎస్ (క్యాడర్) నిబంధనల్లో మార్పులు తేవాలని మోదీ సర్కార్ భావిస్తున్నది. మహారాష్ట్రలోని శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి సర్కార్, పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.