మథుర: సినిమా హీరోయిన్గా అభిమానుల నుంచి చెప్పలేనంత ప్రేమను పొందిన తాను.. ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైన వేదికగా భావించానని, అందుకే అప్పట్లో రాజకీయాల్లో చేరాలని నిర్ణయించుకున్నానని అలనాటి అందాల నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని తెలిపారు. హేమమాలిని ఒకప్పుడు బాలీవుడ్లో ఓ వెలుగువెలిగారు. తన అందచందాలతో అందరిచేతా బాలీవుడ్ డ్రీమ్ గర్ల్గా పలిపించుకున్నారు. సీతా ఔర్ గీతా, షోలే, రజియా సుల్తాన్ తదితర సినిమాలు అమెకు మంచి స్టార్డమ్ తెచ్చిపెట్టాయి.
సినిమాలకు స్వస్తి పలికిన అనంతరం 2004లో బీజేపీలో చేరడం ద్వారా హేమమాలిని రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇటీవల లాంచ్ అయిన సంసద్ టీవీ కార్యక్రమం ఆప్కే సంసద్లో మాట్లాడిన ఆమె.. తాను సినిమా హీరోయిన్గా ప్రజల నుంచి అశేష ఆధరాభిమానాలు పొందానని, వాళ్లు తరచూ తనను ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకావాలని చెబుతుండే వాళ్లని, అందుకే తాను వాళ్లకు తిరిగి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ప్రజాసేవ చేయడానికి ఎంపీ పదవి చాలా చక్కటి అవకాశమని ఆమె పేర్కొన్నారు.
‘ప్రధాని మోదీ ఒకసారి నన్ను ప్రజాసేవ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తున్నది అని అడిగారు. అందుకు నేను చాలా మంచి అనుభూతి అని సమాధానం చెప్పాను’ అని హేమమాలిని తెలిపారు. కాగా, హేమమాలిని 2004 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 2010లో బీజేపీ జనరల్ సెక్రెటరీగా ఎంపికయ్యారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లో మథుర పార్లమెంట్ నియోజకర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2019 జనరల్ ఎలక్షన్లలోనూ అదే స్థానం నుంచి రెండోసారి విజయం సాధించారు.