శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మూడు రోజుల వ్యవధిలో పది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం రాత్రి శ్రీనగర్లోని సౌరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తాయిబా (ఎల్ఈటీ) టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వారిని షకీర్ అహ్మద్ వాజా, అఫ్రీన్ అఫ్తాబ్ మాలిక్గా గుర్తించామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. వారివద్ద ఏకే-47 తుపాకీ, ఓ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
కాగా, అవంతీపొరాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఎల్ఈటీ హతమయ్యారని వెల్లడించారు. టీవీ నటి అమ్రీన్ భట్ (Amreen Bhat) హత్యతో వీరికి సంబంధం ఉన్నదని తెలిపారు. 24 గంటల్లోనే హంతకులను అంతమెందించాని చెప్పారు. మొత్తంగా మూడు రోజుల్లో పది మంది ఉగ్రవాదులు మట్టుబెట్టామని వారిలో ఏడుగురు ఎల్ఈటీకి చెందినవారుకాగా, ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారన్నారు.
బుధవారం రాత్రి బుద్గాం జిల్లా చదూరలో టీవీ నటి అమ్రీన్ భట్ తన మేనల్లుడు ఫర్హాన్ జుబైర్ (10)తో కలిసి ఇంటి బయట ఉండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆమె మరణించగా, తీవ్రంగా గాయపడిన జుబైర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.