Heavy Rain | న్యూఢిల్లీ: కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తర భారతదేశంలో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, యూపీ, బీహార్, అస్సాం, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్ ప్రజలు ప్రయాణాలు, తాగునీరు వంటి అత్యవసరాల కోసం సైతం ఇబ్బందులు పడుతున్నారు. వైమానిక, రైల్వే, రోడ్డు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.
కొండ చరియలు విరిగిపడుతుండటంతో సమీపంలోని ప్రజలు బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. కొండ చరియలు విరగడంతో హిమాచల్ ప్రదేశ్లో అధికారులు సోమవారం ఓ జాతీయ రహదారితోపాటు 70కిపైగా రోడ్లను మూసివేశారు. అస్సాంలో భారీ వర్షాల వల్ల కజిరంగా నేషనల్ పార్క్లోని 131 జంతువులు మృతి చెందగా, 96 జంతువులను కాపాడినట్లు అధికారులు తెలిపారు.
జమ్ము కశ్మీరులోని పూంఛ్ జిల్లాలో మొఘల్ రోడ్డుపై భారీ కొండ చరియ విరగడంతో పూంఛ్, రాజౌరీ జిల్లాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబైలో భారీ వర్షాల కారణంగా విమానాశ్రయంలో రన్వే ఆపరేషన్స్ దాదాపు గంటకుపైగా నిలిచిపోయాయి. 50 విమానాలను రద్దు చేశారు.
ప్రముఖ పర్యాటక ప్రదేశం రాయ్గఢ్ కోటలో ఆదివారం పర్యాటకులు నానా అవస్థలు పడ్డారు. సుమారు 30 మంది పర్యాటకులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. రైల్వే ట్రాక్లపై భారీగా నీరు చేరడంతో పశ్చిమ, మధ్య రీజియన్ రైల్వే అధికారులు చాలా రైళ్లను రీ షెడ్యూల్ చేశారు.