62 ఏండ్లలో తొమ్మిదో అత్యధిక వర్షపాతం
‘ఆరెంజ్ అలర్ట్’ జారీచేసిన వాతావరణ విభాగం
న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం ఉదయం రికార్డు స్థాయిలో 139 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత 62 ఏండ్లలో ఆగస్టులో నమోదైన తొమ్మిదో అత్యధిక వర్షపాతం ఇదేనని, అలాగే 13 ఏండ్లలో ఆగస్టులో రికార్డయిన అత్యధిక రోజువారీ వర్షపాతం కూడా ఇదేనని వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. భారీ వర్షాలతో ఢిల్లీలోని మింటో బ్రిడ్జ్, రాజ్ఘాట్, కన్నాట్ప్లేస్, ఐటీవో తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కీలకమైన పలు అండర్పాస్ల వద్ద భారీగా వర్షపు నీరు చేరడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వాటిని మూసివేశారు. భారీవర్షం నేపథ్యంలో ఐఎండీ ‘ఆరెంజ్ అలర్ట్’ను జారీ చేసింది. వాతావరణం ప్రతికూలంగా ఉండి రోడ్లపై రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశమున్నప్పుడు ఈ హెచ్చరిక జారీ చేస్తారు. పల్లపు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగించేందుకు తమ సిబ్బంది క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నట్లు పీడబ్ల్యూడీ విభాగం అధికారులు తెలిపారు.