న్యూఢిల్లీ: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రతిరోజు 40 నుంచి 45 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఎండలతో జనం అల్లాడుతుంటే రాగల మూడు నాలుగు రోజుల్లో ఓ ఐదు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. అదేవిధంగా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసింది.
ఈ నెల 20వ తేదీ (శనివారం) నుంచి 23వ తేదీ (మంగళవారం) వరకు నాలుగురోజులపాటు ఓ 5 రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు జార్ఖండ్ ప్రాంతాల్లో ఆ నాలుగు రోజులపాటు ఎండలు దంచికొడుతాయని తెలిపింది. అదేవిధంగా ఇవాళ, రేపు (19, 20 తేదీల్లో) 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కేరళ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఆ రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.