న్యూఢిల్లీ, జనవరి 6: పది గంటల సుదీర్ఘ విమాన ప్రయాణంలో ఓ వ్యక్తి గుండె రెండుసార్లు ఆగిపోయింది. కార్డియాక్ అరెస్ట్ అయి స్పృహ కోల్పోయిన విమాన ప్రయాణికుడికి భారత సంతతి వైద్యుడు ప్రాణం పోశాడు. ఈ ఘటన గత నవంబర్లో జరిగింది. బర్మింగ్హామ్ యూనివర్సిటీ దవాఖానకు చెందిన హెపటాలజిస్ట్ డాక్టర్ విశ్వరాజ్ వేమల తన తల్లిని యూకే నుంచి బెంగళూరుకు తీసుకొస్తుండగా, విమానంలో ఓ వ్యక్తి (43) కార్డియాక్ అరెస్ట్కు గురయ్యాడు. విమాన సిబ్బంది పిలుపుతో విశ్వరాజ్ ఆ వ్యక్తి వద్దకు చేరుకొన్నాడు. విమాన క్యాబిన్ సిబ్బంది వద్ద మెడికల్ కిట్లో ఆక్సిజన్, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ మాత్రమే ఉన్నాయి. మిగతా ప్రయాణికుల వద్దనుంచి హార్ట్రేట్ మానిటర్, బీపీ మెషీన్, పల్స్ ఆక్సిమీటర్, గ్లూకోజ్ మీటర్ తీసుకొని, ఆ వ్యక్తి పరిస్థితిని సమీక్షించాడు. అయితే, రెండోసారి కూడా ఆ వ్యక్తి కార్డియాక్ అరెస్ట్కు గురయ్యాడు. అయినా.. విశ్వరాజ్ పట్టువదల్లేదు. మిగ తా ప్రయాణికుల సహకారంతో అతడిని స్పృహలోకి తీసుకొచ్చేందుకు శ్రమించాడు. ఐదుగంటలపాటు ఆవ్యక్తి స్పృహ లో ఉండేలాచూశారు. ప్రయాణికుడి పరిస్థితిదృష్ట్యా విమానాన్ని ముంబైలో ల్యాండ్ చేయగా, అక్కడ వేచి ఉన్న ఎమర్జెన్సీ సిబ్బందికి ఆ వ్యక్తిని విశ్వరాజ్ ప్రాణాలతో అప్పగించారు. ఎయిర్పోర్టులో వైద్య సిబ్బంది తీసుకెళ్తుండగా ఆ వ్యక్తి కళ్లు కృతజ్ఞతా భావంతో చెమర్చాయని, ఇది తన జీవితాంతం గుర్తుపెట్టుకొంటానని విశ్వరాజ్ చెప్పాడు.