న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ సాగుతున్నది. దేశంలో ఇప్పటి వరకు 190కోట్లకుపైగా డోసులు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శుక్రవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమీక్ష నిర్వహించనున్నారు. కొవిన్ వెబ్సైట్ ప్రకారం.. దేశంలో ఇప్పటి వరకు 191 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు వేయగా.. ఇందులో 100కోట్ల మందికిపైగా మొదటి డోస్, 88 కోట్ల మందికి రెండో డోస్, మరో మూడుకోట్ల మందికిపైగా ప్రజలకు ప్రికాషనరీ డోస్ అందించారు. ఇప్పటి వరకు అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 32.23కోట్ల మందికిపైగా టీకాలు వేశారు. ఇందులో 17కోట్లు మొదటి, 14.59కోట్ల మందికి రెండో డోస్, 29లక్షల మందికి బూస్టర్ డోస్ వేశారు.
ఆ తర్వాత 16.62డోస్ల పంపిణీతో మహారాష్ట్ర రెండోస్థానంలో ఉన్నది. ఇదిలా ఉండగా.. గురువారం దేశంలో 2,364 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. పది మంది వైరస్ ప్రభావంతో మృతి చెందగా.. మృతుల్లో ఆరుగురు కేరళకు చెందిన వారు కాగా.. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కొక్కటి చొప్పున మరణాలు నమోదయ్యాయి. ఇదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,419కి చేరింది. పాజిటివిటీ రేటు 0.50శాతం ఉండగా.. కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,31,29,563 కేసులు రికార్డయ్యాయి. ఇందులో 4,25,89,841 మంది రోగులు కోలుకున్నారు. 5,24,303 మంది ప్రాణాలు కోల్పోయారు.