న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశంలో కరోనా మరోసారి జూలు విదిలిస్తున్నది. ఒమిక్రాన్ కారణంగా గడిచిన కొన్ని రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. దీంతో కేంద్రప్రభుత్వం రాష్ర్టాలను అప్రమత్తం చేసింది. కరోనా పరీక్షల కోసం ర్యాట్ (ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్) పరీక్ష కేంద్రాలను పెంచాలని, ఈ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొంది. 24 గంటలపాటు ఈ కేంద్రాలు పనిచేయాలని, మెడికల్, పారామెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉండాలని తెలిపింది. ఆర్టీ-పీసీఆర్ పరీక్షా ఫలితాలు రావడానికి 5-8 గంటల సమయం పడుతుండటం వల్ల వెంటనే ఫలితాలు తెలియజేసే ర్యాట్ పరీక్షల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించింది. లక్షణాలు ఉన్నవాళ్లు ఇంట్లోనే సొంతంగా కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని, ఏడు రకాలైన కొవిడ్ హోం టెస్టింగ్ కిట్లకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని గుర్తుచేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వాలు రోజూవారీ టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచాలని సూచించారు.
లక్షణాలు ఉంటే సెల్ఫ్ ఐసొలేషన్
జ్వరం, తలనొప్పి, గొంతులో మంట, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రుచి-వాసన కోల్పోవడం, అలసట, నీళ్ల విరేచనాలతో బాధపడేవారిని కొవిడ్ అనుమానితులుగా పరిగణించాలని కేంద్రం సూచించింది. అలాంటి వారికి కచ్చితంగా పరీక్షలు నిర్వహించాలన్నది. లక్షణాలు ఉన్నవాళ్లు ఐసొలేషన్లోకి వెళ్లాలని, ప్రభుత్వం ఇప్పటికే జారీచేసిన హోం-ఐసోలేషన్ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.
ఇజ్రాయెల్లో ‘ఫ్లూరోనా’
టెల్అవీవ్: డెల్టా, ఒమిక్రాన్, డెల్మిక్రాన్తో ఇప్పటికే వణికిపోతున్న ప్రపంచానికి మరో ఆందోళన కలిగించే వార్త. ఇజ్రాయెల్లో తొలిసారిగా ఒక మహిళకు ఒకేసారి, కరోనా వైరస్, ఫ్లూ వైరస్ సోకింది. దీనిని ‘ఫ్లూరోనా’గా పిలుస్తున్నారు. బాధితురాలు టీకా వేసుకోలేదని అధికారులు తెలిపారు. ‘ఫ్లూరోనా’ ప్రభావం, లక్షణాలపై ఇంకా స్పష్టత లేదు. ఈ రెండు వైరస్లు తీవ్ర అనారోగ్యానికి దారితీస్తాయా? అన్నదానిపై వైద్యులు అధ్యయనం చేస్తున్నారు.
ఇప్పటికే ఆచరిస్తున్న తెలంగాణ
కరోనా కట్టడికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మొదటి నుంచీ అనుసరిస్తున్న విధానాలను, చేసిన సూచనలనే కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలుగా జారీ చేసింది. తద్వారా తెలంగాణ విధానాలే దేశవ్యాప్తంగా అమలు కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా అన్ని దవాఖానల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లకు అనుమతులివ్వాలని, వైద్య వసతులను పెంచుకోవాలని, అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకోవాలని, ఇంటివద్దనే పరీక్షలు చేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కేంద్రాన్ని కోరింది. ఇంటింటి జ్వర సర్వే నిర్వహించింది. మెడికల్ కిట్లు అందించింది. కరోనా బాధితుల కోసం టెలీ కాలర్ సేవలను ఏర్పాటు చేసింది. హోమ్ టెస్టింగ్ కిట్లకు అనుమతినిచ్చింది. కరోనా కట్టడికి తెలంగాణ తీసుకున్న చర్యలను ఆర్థిక సర్వే, నీతి ఆయోగ్ గతంలోనే ప్రశంసించాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమ్ ఐసొలేషన్ ట్రీట్మెంట్ అండ్ మానిటరింగ్ (హితమ్) ప్రొటోకాల్ నెట్వర్క్ను అత్యుత్తమ ఆవిష్కరణగా కొనియాడాయి.