చెన్నై: ప్రభుత్వ స్కూల్కు చెందిన ప్రధానోపాధ్యాయురాలు దళిత విద్యార్థులతో మరుగుదొడ్లను శుభ్రం చేయించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో పిల్లల తల్లిదండ్రులు ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధానోపాధ్యాయురాలిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు పరారీలో ఉన్న ఆమెను విద్యా శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పెరుందురైలోని పాలక్కరై గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దళిత విద్యార్థులతో మరుగుదొడ్లు, వాటర్ ట్యాంక్ను శుభ్రం చేయిస్తున్నది. విద్యార్థులను రెండు గ్రూపులుగా ఏర్పాటు చేసి రోటీన్ పద్ధతిలో క్లీనింగ్ పనులు చేయిస్తున్నది.
కాగా, టాయిలెట్ల క్లీనింగ్ వల్ల కొందరు విద్యార్థుల చేతులకు దద్దర్లు వచ్చాయి. 5వ తరగతి విద్యార్థి ఇటీవల ఆసుపత్రి పాలయ్యాడు. అతడు డెంగ్యూ బారిన పడ్డాడు. బాలుడి తల్లిదండ్రులు ఆరా తీయగా ఈ విషయం బయటపడింది. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఈ సంగతి తెలిసింది. దీంతో వారంతా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ప్రధానోపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. పిల్లల సంరక్షణ కమిటీకి కూడా దీనిపై ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఆ ప్రధానోపాధ్యాయురాలిపై ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఆమెను త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. కాగా, విద్యా శాఖ అధికారులు కూడా దీనిపై స్పందించారు. ఆ ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.