గువాహతి: టీచర్ల అలసత్వాన్ని సహించలేని ప్రధానోపాధ్యాయుడు పెద్ద కొడవలితో స్కూల్కు వచ్చాడు. దానిని చేతపట్టి స్కూల్ కారిడార్లో అటూ ఇటూ తిరిగాడు. దీంతో స్కూల్ టీచర్లు, విద్యార్థులు భయాందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హడావుడిగా ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. అస్సాంలోని సిల్చార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తారాపూర్ ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల ధృతిమేధ దాస్, రాధామాధవ్ బునియాడి పాఠశాలలో 11 సంవత్సరాలుగా ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. శనివారం ఆయన పెద్ద కొడవలిని చేతపట్టి స్కూల్కు వచ్చాడు. దానిని భుజంపై వేసుకుని క్లాసుల్లోకి తొంగి చూశాడు. అనంతరం మారణాయుధం చేతపట్టి స్కూల్ కారిడార్లో నడిచాడు.
కాగా, ప్రధానోపాధ్యాయుడు దాస్, కొడవలితో స్కూల్లో తిరుగడం చూసి ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళన చెందారు. స్కూల్ సిబ్బంది ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మారణాయుధం చేతపట్టుకుని ఉన్న హెడ్ మాస్టార్ దాస్ను చూసి షాకయ్యారు. పోలీసులు ఆయనను ఆరా తీయగా అసలు విషయం చెప్పాడు. ఉపాధ్యాయులు స్కూల్కు సరిగా రావడం లేదని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో అసహనం చెందిన తాను టీచర్లను హెచ్చరించేందుకు కొడవలితో స్కూల్కు వచ్చినట్లు తెలిపాడు.
మరోవైపు ప్రధానోపాధ్యాయుడు దాస్పై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యా శాఖాధికారులు స్పందించారు. మారణాయుధంతో స్కూల్కు వచ్చి అందరినీ భయాందోళనకు గురి చేసిన హెడ్ మాస్టార్ దాస్ను సస్పెండ్ చేశారు.
WATCH – Assam: Head teacher suspended after he comes to school carrying machete.#Assam pic.twitter.com/etMHR1e5Vm
— TIMES NOW (@TimesNow) November 7, 2022