ఆజంగఢ్ (ఉత్తరప్రదేశ్): శ్రద్ధావాకర్ దారుణ హత్య ఘటన మరువక ముందే, ఇదే తరహా మరో కిరాతక ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్ జిల్లాలో జరిగింది. మాజీ ప్రియురాలిని ఓ యువకుడు గొడ్డలితో దారుణంగా చంపి శరీర భాగాలను చెరువు, బావి, వ్యవసాయ క్షేత్రంలో విసిరేశాడు. మృతురాలి శరీర భాగాలను సేకరించిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మరో ఎనిమిది మంది కోసం గాలిస్తున్నారు. ఎస్పీ అనురాగ్ ఆర్య ప్రకారం.. ఆజంగఢ్ జిల్లా అహ్రౌలా పోలీస్స్టేషన్ పరిధిలోని పశ్చిమ్ పట్టికి చెందిన అనురాధ ప్రజాపతి, ప్రిన్స్ యాదవ్ ప్రేమించుకున్నారు. రెండేండ్ల క్రితం విడిపోయారు. ప్రిన్స్ యాదవ్ విదేశాలకు వెళ్లగా.. గత ఫిబ్రవరిలో అనురాధకు వివాహం జరిగింది. ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన ప్రిన్స్యాదవ్ అమెను కలిశాడు. వివాహం రద్దు చేసుకొని తనతో వచ్చేయాలని భయపెట్టాడు. ఆమె యాదవ్తో వచ్చేందుకు నిరాకరించింది. దీంతో అనురాధను అంతమొందించాలని యాదవ్ కుట్ర చేశాడు. దేవాలయం వద్ద కలుసుకొందామని ఈ నెల 10న అనురాధను బయటకు పిలిపించాడు. తన వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి గొంతు కోసి చంపేశాడు. శరీరాన్ని గొడ్డలితో ముక్కలుగా నరికాడు. తలను చెరువులో పడేశాడు. దుస్తులు, కొన్ని శరీర భాగాలను బావిలో, ఇతర ప్రదేశాల్లో విసిరేశాడు. యువతి తల్లిదండ్రులు స్థానిక ఠాణాలో మిస్సింగ్ కేసు పెట్టగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 15న శరీర భాగాలను గుర్తించారు. 19న నిందితుడు ప్రిన్స్యాదవ్ను అరెస్టు చేసి విచారించగా, నేరం అంగీకరించాడు. ఘటనా స్థలానికి నిందితుడిని తీసుకెళ్లగా, తప్పించుకొనే ప్రయత్నం చేయగా.. పోలీసులు కుడి కాలుపై కాల్చారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నది.