పట్నా/హైదరాబాద్, ఏప్రిల్ 25: మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దళిత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న బీహార్కు చెందిన గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్సింగ్ జైలు నుంచి విడుదల కానున్నారు. బీహార్ ప్రభుత్వం ఇటీవల మార్చిన జైలు నిబంధనలతో ఆయన బయటపడనున్నారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వివాదానికి తెరలేపింది. ఆనంద్ మోహన్ విడుదల నేరస్థులను ప్రోత్సహించడమేనని, దీనిపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కృష్ణయ్య సతీమణి ఉమా కృష్ణయ్య డిమాండ్ చేశారు.ఆనంద్ మోహన్ కోసమే నితీశ్ ప్రభుత్వం జైలు నిబంధనలు మార్చిందని బీజేపీ, బీఎస్పీ ఆరోపిస్తున్నాయి.
ఆనంద్ మోహన్సింగ్ గత 15 ఏండ్లుగా జైలులోనే ఉన్నారు. బీహార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న జైలు మాన్యువల్-2012ను మార్చింది. ప్రభుత్వ ఉద్యోగుల హత్య కేసుల్లో శిక్ష పడిన వారిని సత్ప్రవర్తన కింద విడుదల చేయొద్దని చెబుతున్న 481వ నిబంధనను తీసేసింది. దీంతో ఆనంద్ మోహన్సింగ్ సహా 26 మంది జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైంది.
ముజఫర్పూర్లో జరిగిన ఛోటన్ శుక్లా అంత్యక్రియల సందర్భంగా.. తన అనుచరులను ఆనంద్ మోహన్ రెచ్చగొట్టి దాడులకు పురిగొల్పాడు. దుండగుల దాడిలో దళిత ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య ప్రాణాలు కోల్పోయారు.
ఆనంద్ మోహన్ విడుదల నిర్ణయాన్ని దివంగత దళిత ఐఏఎస్ కృష్ణయ్య సతీమణి ఉమా కృష్ణయ్య తప్పుపట్టారు. ఈ నిర్ణయం సమాజంలో తప్పుడు సంకేతాలను పంపుతుందని, నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నదని ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని బీహార్ సీఎంకు చెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు.