HD Kumaraswamy | కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. బెంగలూరులోని గోల్డ్ ఫించ్ హోటల్లో బీజేపీ-జేడీఎస్ పాదయాత్రకు సంబంధించిన అంశంపై బెంగళూరులోని ఓ హోటల్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో కుమారస్వామి ముక్కు నుంచి రక్తం కారడం కనిపించింది. చొక్కాపై సైతం రక్తపు మరకలు కనిపించాయి. ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో జేఈఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.
అయితే, కుమారస్వామి ముక్కు నుంచి రక్తం కారడానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. బీజేపీ, జేడీఎస్ కూటమి సమన్వయ కమిటీ ఆదివారం సమావేశమైంది. ఈ సమావేశంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగళూరు నుంచి మైసూర్ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. పాదయాత్రలో ఇటీవల వెలుగు చూసిన అవినీతి, కుంభకోణాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పాదయాత్ర చేపట్టాలని భావించారు. పాదయాత్ర వచ్చే శనివారం ప్రారంభం కానున్నది. ఆగస్టు 3న మొదలై.. 10న ముగియనున్నది.