Sabarimala Temple | కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో ‘ఆరవణ (Aravana)’ ప్రసాదం విక్రయాలను నిలిపివేయాలంటూ ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు (Travancore Devaswom Board)ను కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రసాదం తయారీలో ఉపయోగించే యాలకుల్లో (Cardamom) పరిమితికి మించి రసాయనాలు వినియోగించినట్లు ఇటీవల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చేపట్టిన లేబొరేటరీ పరీక్షల్లో తేలింది. ఈ యాలకుల్లో 14 రకాల రసాయనాలు మోతాదుకు మించి ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ నివేదికలో స్పష్టం చేసింది.
ఈ నివేదిక ఆధారంగా విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు.. ఆరవణ ప్రసాదం విక్రయాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రసాయన పదార్థాలతో కూడిన యాలకులు లేకుండా తయారుచేసిన ప్రసాదం విక్రయించుకోవచ్చని సూచించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేసిన యాలకులతో తయారుచేసిన ప్రసాదాన్ని విక్రయించుకోవచ్చని ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డుకు స్పష్టం చేసింది.