న్యూఢిల్లీ : కరోనా రోగులకు సకాలంలో ప్రాణ వాయువు అందాల్సిన క్రమంలో ఢిల్లీలో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. తమకు కేటాయించిన ఆక్సిజన్ సరఫరాలు తగినంతగా అందుబాటులోకి రాకుంటే 24 గంటల్లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ప్రాణ వాయువు కొరతతో దేశ రాజధానిలో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చొరవ చూపాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది.
ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ఈ దిశగా చర్యలు చేపట్టాలని సూచించింది. ఆక్సిజన్ సరఫరాలతో పాటు తయారీని పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని కోర్టు స్పష్టం చేసింది. కాగా, ఢిల్లీకి రావాల్సిన 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కోటా రాష్ట్రానికి దక్కేలా కోర్టు విధివిధానాలను రూపొందించాలని ఢిల్లీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ రాహుల్ మెహ్రా కోరారు. తమకు 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయింపు ఉన్నా శుక్రవారం కేవలం 296 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా జరిగిందని మెహ్రా కోర్టుకు నివేదించారు. తమకు దక్కాల్సిన 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తమకు అందకుంటే 24 గంటల్లోనే మొత్తం వైద్యారోగ్య మౌలిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.