జైపూర్: ఎక్కువ మంది పిల్లల్ని కనాలని (Have More Children) రాజస్థాన్కు చెందిన బీజేపీ మంత్రి బాబులాల్ ఖరాడీ ప్రజలను కోరారు. వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. ప్రధాని మోదీ వారి కోసం ఇళ్లు నిర్మిస్తారని చెప్పారు. మంగళవారం ఉదయ్పూర్లోని నాయి గ్రామంలో ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించింది. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి బాబులాల్ ఖరాడీ ఈ సందర్భంగా మాట్లాడారు. ‘ఎవరూ ఆకలితో, తలపై కప్పు (ఇళ్లు) లేకుండా నిద్రపోకూడదన్నది ప్రధానమంత్రి కల. మీరు చాలా మంది పిల్లల్ని కనండి. ప్రధాన మంత్రి మీకు ఇళ్ళు కట్టిస్తారు. అప్పుడు సమస్య ఏముంటుంది?’ అని అన్నారు. ఇది విని వేదికపై ఉన్న వారు నవ్వుకున్నారు.
కాగా, 2023లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఝడోల్ నుంచి బాబులాల్ ఖరాడీ నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2022లో ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన ఇటీవల క్యాబినెట్ మంత్రిగా చేరారు. ఆయనకు ఇద్దరు భార్యలు, ఎనిమిది మంది సంతానం. వీరిలో నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఉదయ్పూర్ జిల్లాలోని నీచ్లా తాలా గ్రామంలో ఆయన కుటుంబం నివసిస్తున్నది.