న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలతో సమాజంలో అశాంతిని ప్రేరేపించే ఘటనలు మోదీ సర్కారు హయాంలో విపరీతంగా పెరిగిపోయినట్టు ఇంగ్లిష్ న్యూస్పోర్టల్ ‘ఎన్డీటీవీ’ హేట్ స్పీచ్ ట్రాకర్ విశ్లేషణలో తేలింది. యూపీఏ 2 సర్కారు హయాంలో (2009-2014) విద్వేష ప్రసంగాలు నెలకు సగటున 0.3 శాతం ఉంటే, మోదీ ప్రభుత్వ హయాంలో (2014-2021) ఇది 3.7 శాతానికి ఎగబాకింది. అంటే 1,130 శాతం పెరిగినట్టు తెలిపింది. యూపీఏ 2 సర్కారు హయాంలో మొత్తం 19 మంది ప్రముఖులు విద్వేష వ్యాఖ్యలు చేయగా, మోదీ హయాంలో ఏకంగా 348 మంది ప్రముఖులు విద్వేష ప్రసంగాలు చేశారు. ఇందులో 80 శాతం మంది బీజేపీకి చెందినవారే. మరో నెల రోజుల్లో ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విద్వేష ప్రసంగాలు మరింతగా పెరిగాయని, గడిచిన మూడున్నర నెలల్లోనే సగటున 160 శాతం పెరుగుదల నమోదైనట్టు వివరించింది. మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతూ హింసాత్మక ఘటనలను రెచ్చగొట్టడాన్ని విద్వేషపూరిత ప్రసంగాలుగా పరిగణించింది. ఆరెల్డీ, బీకేయూ, ఎన్సీపీ, ఆప్, సీపీఎం, డీఎంకే, హెచ్ఏఎం, జనతాపార్టీ, వీహెచ్పీ, జేడీఎస్ పార్టీల్లో ఒక్కొక్కరు చొప్పున విద్వేష వ్యాఖ్యలు చేశారు. కాగా, మహాత్మాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హిందూమత నాయకుడు కాళీచరణ్ మహరాజ్ను మహారాష్ట్రలోని వార్ధా పోలీసులు అరెస్టు చేశారు.