న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) నిర్వహించిన ఒక ర్యాలీలో కొందరు వక్తలు విద్వేష ప్రసంగాలు చేశారు. ‘వారి చేతులు, తల నరకండి, తుపాకులు చేతపట్టండి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఒక యువకుడి హత్య నేపథ్యంలో వీహెచ్పీ ఆధ్వర్యంలో ఒక సభ జరిగింది. జగత్ గురు యోగేశ్వర్ ఆచార్య ద్వేష పూరితంగా ప్రసంగించారు. ‘అవసరమైతే వారి చేతులు, తల నరకండి. గరిష్టంగా జైలుకు వెళతారు. అయితే గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ వ్యక్తులను గుర్తించి కొట్టండి’ అని ఆచార్య అన్నారు.
అనంతరం మాట్లాడిన మహంత్ నావల్ కిషోర్ దాస్ కూడా రెచ్చగొట్టేలా ప్రసంగించారు. ‘తుపాకులు, లైసెన్సులు పొందండి. లైసెన్స్లు పొందకపోయినా చింతించకండి. నిన్ను చంపడానికి వచ్చిన వారికి లైసెన్సులు ఉన్నాయా? కాబట్టి మీకు లైసెన్స్ ఎందుకు అవసరం?’ అని ప్నశ్నించారు. ‘మనమందరం కలిస్తే ఢిల్లీ పోలీస్ కమిషనర్ కూడా మనకు టీ ఇచ్చి మనం కోరుకున్నది చేయనిస్తారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, వీహెచ్పీ వక్తల విద్వేష ప్రసంగాలను ఆ సంస్థ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ సమర్థించారు. జిహాదీలకు వ్యతిరేకంగాను, ఆత్మరక్షణ కోసం ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఏ వర్గాన్ని ఉద్దేశించి కాదని అన్నారు. అయితే ఢిల్లీలో 25 ఏళ్ల మనీష్ను ముస్లిం స్నేహితులైన ఇద్దరు హత్య చేయడంపై వీహెచ్పీ జన ఆక్రోశ్ ర్యాలీ నిర్వహించింది.
మరోవైపు మనీష్ హత్యలో ఎలాంటి మతపరమైన కోణం లేదని పోలీసులు తెలిపారు. ఏడాది కిందట తన మొబైల్ ఫోన్ను లాక్కొన్న ఇద్దరు స్నేహితులపై ఆ యువకుడు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆ కేసును వెనక్కి తీసుకోవాలంటూ మృతుడిపై వారు ఒత్తిడి తెచ్చారని, అతడు తిరస్కరించడంతో వారు దాడి చేయడంతో మరణించాడని వెల్లడించారు.