Spyware | న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: కేంద్ర ప్రభుత్వం మరో స్పైవేర్ను కొనుగోలు చేసిందా? ఇందుకుగానూ ఈ సారి పెగాసస్ స్పైవేర్ తయారీ సంస్థ ఎన్ఎస్వో గ్రూపునకు ప్రత్యర్థి కంపెనీ అయిన కాగ్నైట్ను ఎంచుకొన్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థ ‘ది హిందూ’ తన కథనంలో సంచలన విషయాలు వెల్లడించింది. భారత రక్షణ ఏజెన్సీ సిగ్నల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్(ఎస్ఐడీ) ఇజ్రాయెల్ స్పైవేర్ సంస్థ కాగ్నైట్ నుంచి ఎక్విప్మెంట్ను కొనుగోలు చేస్తున్నదని వెల్లడించింది. దీన్ని ధ్రువీకరించుకొనేందుకు ట్రేడ్ డాటాను పరిశీలించినట్టు తెలిపింది. గత మూడేండ్లుగా కాగ్నైట్, దాని మాతృసంస్థ వేరింట్ సిస్టమ్స్.. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ) ఆధ్వర్యంలో నడిచే ఎస్ఐడీకి కంప్యూటర్ పరికరాలు సరఫరా చేస్తున్నదని పేర్కొన్నది. కాగ్నైట్ స్పైవేర్ కంపెనీపై ఇప్పటికే పలు వివాదాలు ఉన్న నేపథ్యంలో ఈ కొనుగోళ్ల అంశం ప్రాధాన్యం సంతరించుకొన్నది. ఈ స్పేవేర్ పెద్దమొత్తంలో దుర్వినియోగం అవుతున్నట్టు మెటా ఓ రిపోర్టులో పేర్కొన్నది. కాగా, ఈ ఎక్విప్మెంట్ దిగుమతులపై ఇటు భారత రక్షణ శాఖ కానీ, అటు కాగ్నైట్ సంస్థ కానీ స్పందించలేదని హిందూ తెలిపింది.
2019 లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ను వినియోగించి చాలా మంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు తదితరులపై నిఘా పెట్టిందని ‘ఫర్ బిడెన్ స్టోరీస్’ ఓ నివేదిక బయటపెట్టింది. అయితే స్పైవేర్ కొనుగోలుపై బీజేపీ ప్రభుత్వం అంగీకరించడం లేదా ఖండించకపోవడం స్పైవేర్ నిఘా జరిగిందనే వాదనకు బలం చేకూర్చినట్టు అయింది. 2017లో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఇదేవిధంగా పెగాసస్ స్పైవేర్ తయారీ సంస్థ నుంచి కంప్యూటర్ పరికరాలు కొనుగోలు చేసిందని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు(ఓసీసీఆర్పీ) గతంలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎస్ఐడీ కాగ్నైట్ నుంచి కూడా ఇవే పరికరాలను కొనుగోలు చేయడం ‘నిఘా’ అనుమానాలు మరింతగా పెంచుతున్నది.
కాగ్నైట్ స్పేవేర్ ఫోన్లోని డాటాను తన సర్వర్లలో స్టోర్ చేసుకొని, వ్యక్తికి తెలియకుండానే ఫోన్ నుంచి డాటాను డిలీట్ చేయగలగడం లేదా ప్రవేశపెట్టడం చేయగలదు. ఫోన్లోకి మాల్వేర్ ప్రవేశించినట్టు కూడా తెలియకపోవడం దీని ప్రత్యేకత. అయితే ఈ స్పైవేర్ పెద్ద మొత్తంలో దుర్వినియోగం అవుతున్నట్టు మెటా ఓ రిపోర్ట్లో పేర్కొన్నది. కాగ్నైట్ స్పైవేర్తో ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు, ప్రభుత్వ విమర్శకులు, హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నేతలు, అసమ్మతివాదులపై నిరంతరంగా నిఘా పెట్టిందనే ఆరోపణలు కాగ్నైట్ సంస్థపై ఉన్నాయి. నార్వేకు చెందిన వెల్త్ ఫండ్ దీని వాడకాన్ని నిలిపేసింది. అయితే, బంగ్లాదేశ్, మయన్మార్ కాగ్నైట్ కంపెనీతో స్పైవేర్ ఒప్పందాలు చేసుకొన్నాయి. దీనిపై పెద్దయెత్తున విమర్శలు వస్తున్నాయి.