న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: లోపాలు కలిగిన(డిఫెక్టివ్) కొన్ని వందల ఈవీఎంలు, వీవీప్యాట్లు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) దగ్గర ఉండటం సాధారణమైపోయింది. ప్రస్తుతం 6.5 లక్షల ఈవీఎంలు, వీవీప్యాట్లలో లోపాలున్నా ఈసీఐ దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు! ఈ విషయమై ఎన్నికల నిపుణులు, పరిశీలకులు అడిగిన ప్రశ్నలకు ఈసీఐ ఇంతవరకు సమాధానం కూడా ఇవ్వలేదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు కీలకమైన ఎన్నికల నిర్వహణలో భారత ఎన్నికల సంఘం ఇలా ఉదాసీనంగా వ్యవహరించడంపై విపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్3 జనరేషన్కు చెందిన ఓటింగ్ యంత్రాలను 2018 నుంచి ఈసీఐ ఎన్నికల్లో వినియోగిస్తున్నది. 2019 లోక్సభ ఎన్నికల్లో 17.4 లక్షల వీవీప్యాట్లను ఉపయోగించింది. అంటే లోపాలు కలిగిన మూడో వంతు(37 శాతం) మెషీన్ల సాయంతోనే ఈసీఐ ఎన్నికలను నిర్వహించింది. కొన్నిసార్లు ఒక సిరీస్ మొత్తం వీవీప్యాట్లను రీప్లేస్ చేసిన అనుభవం ఈసీఐకి ఉన్నది. ఉదాహరణకు హైదరాబాద్లోని ఈసీఐఎల్ సంస్థ తయారుచేసిన వీవీప్యాట్లు EVTEA 0001 నుంచి EVTEA 99999 వరకు అన్నింటిలో లోపాలు ఉన్నట్టు గుర్తించారు. బెంగళూరులోని బీఈఎల్ కంపెనీ తయారుచేసిన మెషీన్లది ఇదే పరిస్థితి. పంచకులలోని బీఈఎల్ కంపెనీ తయారు చేసిన 2,53,500 మెషీన్లన్నింటిలోనూ లోపాలున్నాయని స్వయంగా ఈసీఐ అధికారులే గుర్తించారు. ‘ఈ సిరీస్ కలిగిన మెషీన్లను 2018లో మొదటిసారి ప్రవేశపెట్టారు. అప్పటినుంచి వీటిని ఎన్నికల్లో ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు వీటిని వెనక్కి రప్పించాము. కొత్త మెషీన్లు దాదాపు అన్ని జిల్లాలకు చేరాయి’ అని ఈసీఐ వర్గాలు ఈ విషయమై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాయి.
వివాదం లేదా లోపం ఉన్న ఏ మెషీన్ను అయినా వాడకం నుంచి మినహాయిస్తారు. ఈసీఐ ప్రధాన కార్యాలయ సమాచారం ప్రకారం అక్టోబర్ 8, 2021 నుంచి లోపాలు కలిగిన వీవీప్యాట్లు మరమ్మతుల కోసం నిరీక్షిస్తున్నాయి. అయితే ది వైర్ వెబ్సైట్ పరిశీలన ప్రకారం అండమాన్ నికోబార్, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూలకు వీవీప్యాట్లు మరమ్మతుల కోసం నిరీక్షిస్తున్నాయన్న సమాచారం అందలేదు. కానీ ఈసీఐ సీఈవో మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల మెషీన్లు ఉంచే గోదాములను జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరవాలి, మూయాలి. అయితే గతేడాది డిసెంబర్లో వీవీప్యాట్ల తరలింపుకు తమ సమ్మతిని ఈసీఐ అడిగిందని, అయితే తాము మొత్తం ఒక సిరీస్ మెషీన్లు అన్ని ఎందుకు తరలిస్తున్నారని అడిగితే, సమాధానం మాత్రం ఇవ్వలేదని విపక్షానికి చెందిన ఒక నాయకుడు ‘ది వైర్’ వెబ్సైట్కు తెలిపారు.
అధిక సంఖ్యలో ఈవీఎంలు/వీవీప్యాట్లు లోపాలు కలిగి ఉండటంపై ఎన్నికల నిపుణులు, అనుభవజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇప్పుడు వాళ్లు(ఈసీఐ) 6.5 లక్షల మెషీన్లలో లోపాలున్నాయని చెప్తున్నారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం’ అని మాజీ సీఈసీ ఎస్.వై.ఖురేషీ అభిప్రాయపడ్డారు. ఈసీఐ ప్రామాణిక నిర్వహణ విధానం ప్రకారం జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో మెషీన్లను మొదటి దశలో తనిఖీ చేయాలి. ఇలా ఫస్ట్ లెవల్ చెక్(ఎఫ్ఎల్సి)లో తిరస్కరణకు గురైన ఈవీఎంలు, వీవీప్యాట్లను మరమ్మతుల కోసం తనిఖీలు జరిగిన వారం రోజుల్లోగా తయారీ కంపెనీలకు పంపించాలి. అయితే లోపాలు కలిగిన మెషీన్లు ఏడాది కాలంగా ఈసీఐ కస్టడీలో మూలన పడి ఉన్నాయి. ‘ఈసీఐ పారదర్శకత పాటించకపోవడం, మెషీన్లను భద్రత పరచడంలో గోప్యతను పాటించడం అనుమానాలకు తావిస్తున్నది’ అని ఐఐటీ కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ సందీప్ శుక్లా తెలిపారు. అసలు ఈసీఐ ఈవీఎంలు, వీవీప్యాట్లకు ఆడిట్ నిర్వహిస్తున్నదా… అని ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్, సిటిజన్స్ కమిషన్ ఆఫ్ ఎలక్షన్స్ సభ్యుడు సుభాష్ బెనర్జీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలను ది వైర్ వెబ్సైట్ ఈ నెల 10న ఈసీఐకి పింపింది.