చంఢీగఢ్, ఫిబ్రవరి 10: హర్యానా ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్లపై ఆంక్షలు విధించింది. ఈ నెల 13న రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ ఆందోళనను పురస్కరించుకుని శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో వీటి నిషేధాన్ని అమలు చేయాలని శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం అంబాల, కురుక్షేత్ర, కైతల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఈ నెల 11వ తేదీ ఉదయం 6 నుంచి 13వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేస్తారు. కాగా, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సుమారు 200 రైతు సంఘాలు ఢిల్లీకి మార్చ్ నిర్వహించనున్నాయి.