న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ రోజు రోజుకు విస్తరిస్తున్నది. దీంతో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా కేసులు (Corona cases) నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. హర్యానాలో మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దీంతో రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో సినిమా థియేటర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, ఈత కొలన్లను మూసివేసింది. కేసులు అధికంగా రికార్డవుతున్న గుర్గ్రామ్, ఫరీదాబాద్, అంబాలా, పంచకుల, సోనిపట్ జిల్లాల్లో ఈ ఆంక్షలు జనవరి 2 నుంచి పది రోజులపాటు అమల్లో ఉంటాయని ప్రకటించింది. అదేవిధంగా మాల్స్, మార్కెట్లను సాయంత్రం 5 గంటలకు మూసివేయాలని స్పష్టం చేసింది. ఇక బార్లు, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుపుకోవచ్చని తెలిపింది.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సగం మంది ఉద్యోగులతోనే కార్యకలాపాలు నిర్వహించాలని పేర్కొన్నది. కాగా, ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది.