చండీగఢ్, జూలై 19: బీజేపీ పాలిత హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. డీఎస్పీ ర్యాంకు సీనియర్ పోలీస్ ఆఫీసర్ను రాళ్ల ట్రక్కుతో ఎక్కించి పట్టపగలు దారుణంగా హత్యచేసింది. పంచ్గావ్ రీజియన్లోని నూహ్ ప్రాంతంలో ఆరావళి పర్వతాలను తొలిచి అక్రమంగా రాళ్లు తరలిస్తున్నారన్న సమాచారంతో డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్ మంగళవారం ఉదయం 11.30 ఆ ప్రాంతానికి వెళ్లారు. రాళ్లతో వెళ్తున్న ట్రక్కుకు ఎదురు వెళ్లి ఆపటానికి ప్రయత్నించటంతో డ్రైవర్ ట్రక్కును సురేందర్సింగ్ పైనుంచి పోనిచ్చాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.
తప్పించుకుపారిపోతున్న ట్రక్కు డ్రైవర్పై పోలీసులు కాల్పులు జరుపగా నిందితుడి కాలికి గాయమైనట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు వివరించారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించటంతో ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ స్పందించారు. సురేందర్సింగ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించారు. ఆయన కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు. సురేందర్సింగ్ మృతికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు.
కరిగిపోతున్న గుట్టలు
భూమిపైనే అతి పురాతనమైన ఆరావళి పర్వతాల శ్రేణి హర్యానాలో కొంతవరకు ఉంటుంది. హర్యానాతోపాటు ఢిల్లీకి కూడా ఈ పర్వతాలు పర్యావరణ పరంగా ఎంతో కీలకం. కొన్నేండ్లుగా ఈ పర్వతాలను అక్రమార్కులు తొలిచేస్తున్నారు. దీనిని అడ్డుకొనేందుకు పర్యావరణవేత్తలు, ఉద్యమకారులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు గత ఏడాది సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. కొందరు పర్యావరణ ఉద్యమకారులు ఆరావళి బచావో ఆందోళన్ అనే సంస్థను ఏర్పాటుచేసి పర్వతాల రక్షణకు పోరాటం చేస్తున్నారు. నిజానికి ఆరావళి ప్రాంతంలో మైనింగ్ను సుప్రీంకోర్టు 2009లోనే నిషేధించింది.