చండీగఢ్, జనవరి 5: హర్యానాలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే ఇండ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం జరిపిన దాడుల్లో భారీ ఎత్తున అక్రమ సొత్తు లభించింది. వందకుపైగా విదేశీ మద్యం సీసాలు, రూ.5 కోట్ల నగదు, కొన్ని విదేశీ తయారీ తుపాకులు, 300 తూటాలు స్వాధీనం చేసుకున్నామని ఈడీ వర్గాలు వెల్లడించాయి. అక్రమ మైనింగ్కు సంబంధించిన ఓ కేసులో ఏడీ అధికారులు కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వర్, లోక్దళ్ మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ ఇండ్లలో సోదాలు జరిపారు.
మైనింగ్ వ్యాపారం చేస్తున్న సురేందర్ పన్వర్, అతని సహచరుల ఇండ్లలో ఈడీ అధికారులు గురువారం నాడే సోదాలు ప్రారంభించారు. వారి ఇండ్లు, కార్యాలయాలు, ఇతర ప్రదేశాల్లో ఈ సోదాలు కొనసాగాయి. దిల్బాగ్ సింగ్ యమునానగర్ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించగా, సురేందర్ పన్వర్ ప్రస్తుతం సోనీపట్ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్నారు. వీరిద్దరికి చెందిన దాదాపు 20 ప్రదేశాల్లో సోదాలు జరిగాయి. ఈ సోదాలలో మద్యం, నగదుతోపాటు నాలుగు నుంచి ఐదు కిలోల బరువున్న మూడు బంగారం బిస్కెట్లు కూడా లభించాయి. యమునానగర్ దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో మైనింగ్పై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిషేధం విధించినప్పటికీ వీరు తవ్వకాలు కొనసాగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరిపై కేసులు నమోదు కాగా ఈడీ హవాలా చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించింది.