చండీఘడ్: అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రశంసిస్తూ ఇవాళ హర్యానా అసెంబ్లీ(Haryana Assembly)లో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానాన్ని సీఎం మనోహనల్ లాల్ ఖట్టార్ ప్రవేశపెట్టారు. జేజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చింది. అయోధ్య రామాలయ నిర్మాణం వెనుక ఎంతో పోరాటం ఉందని ఖట్టర్ తెలిపారు. శ్రీరాముడి స్పూర్తి దేశమంతా ఉందన్నారు. విజయవంతంగా రామ్లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. మన జీవిత కాలంలో రామాలయాన్ని నిర్మించడం మన అదృష్టంగా భావించాలన్నారు. ఆలయ నిర్మాణం కోసం ఎన్నో పోరాటాలు సాగాయని,ఓ సారి లక్నో లో జరిగిన ఆందోళనలో తాను అరెస్టు అయినట్లు ఆయన వెల్లడించారు. అప్పుడు తనను 15 రోజులు జైలులో వేసినట్లు చెప్పారు. మోదీ నాయకత్వం వల్లే రామాలయ నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హూడా కూడా తీర్మానానికి మద్దతు ఇచ్చారు.