సిమ్లా : తరచూ వైరల్ వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునే ఆర్పీజీ చీఫ్ హర్ష్ గోయంకా తాజా వీడియో సోషల్ మీడియాలో తెగవైరలవుతోంది. అత్యంత ఇరుకైన రోడ్డులో బస్ వెళుతున్న వీడియోను గోయంకా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని ఓ ఇరుకైన రోడ్డుపై బస్ వెళుతున్న వీడియో చూపరులను వణికించేలా ఉంది.
The passengers on this bus must be given awards for bravery #HimachalPradesh
pic.twitter.com/Rs24lpdEhu— Harsh Goenka (@hvgoenka) November 20, 2022
51 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ క్లిప్లో ఓవైపు కొండచరియలు, మరోపక్క లోయ ఆపై ఇరుకైన రోడ్డుపై బస్ వెళుతుండటం కనిపిస్తుంది. హిమాచల్లోని చంబ-కిల్లర్ రోడ్డుపై ఈ బస్ వెళుతోంది. ఈ బస్లోని ప్రయాణీకుల ధైర్య సాహసాలకు వారందరికీ అవార్డులు ఇవ్వాల్సిందే అని ఈ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు.
ఆన్లైన్లో షేర్ చేసిన అనంతరం ఈ వీడియో పది లక్షలపైగా వ్యూస్ రాబట్టింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్ట్ అయ్యారు. ఆ బస్ ప్రయాణీకులు ఎలాగైతే డ్రైవర్పై నమ్మకం ఉంచారో మనం కూడా సంక్లిష్ట పరిస్ధితిలో దేవుడిపై విశ్వాసం ఉంచాలని ఓ యూజర్ కామెంట్ చేయగా, మారుమూల గ్రామాల ప్రజలను సమీప పట్టణాలకు తీసుకువెళ్లే డ్రైవర్లకు సాహస అవార్డులు ఇవ్వాలని మరో యూజర్ రాసుకొచ్చారు.