చండీఘడ్: భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్(Harbhajan Singh) వద్ద 23 మంది పంజాబ్ పోలీసులు సెక్యూర్టీ సిబ్బందిలో ఉన్నారు. దీనిపై పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. అంత మంది సిబ్బందిని ఎలా నియమించారని కోర్టు నిలదీసింది. జస్టిస్ జగ్మోహన్ భన్సల్ ఈ కేసులో స్పందించారు. అధికారిక రికార్డుల ప్రకారం కేవలం 8 మంది సిబ్బందికి మాత్రమే అనుమతి ఉందని, కానీ అదనంగా అనధికార రీతిలో మరో 15 మంది పోలీసుల్ని ఎలా కేటాయించారని జస్టిస్ భన్సల్ ప్రశ్నించారు. జిల్లా వారీగా సిబ్బందిపై లెక్కింపు చేయాలని జస్టిస్ భన్సల్ ఆదేశించిన నేపథ్యంలో ఈ విషయం బయటకు వచ్చింది.
సెక్యూర్టీ పరిధిలో ఎంత మంది ఉన్నారు, అధికారికంగా లేదా అనధికారికంగా ఎంత మంది సిబ్బంది విధుల్లో ఉన్నారో తెలుసుకోవాలని జస్టిస్ భన్సల్ ఆదేశించారు. సెక్యూర్టీ ఏడీజీపీ, మోఘా జిల్లా ఎస్ఎస్పీకి జస్టిస్ భన్సల్ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ముందు వేర్వురుగా అఫిడవిట్లు సమర్పించాలన్నారు. అలాగే పిటీషనర్లకు కానీ, వారి కుటుంబీకులకు కానీ ఎటువంటి హాని జరగవద్దు అని జస్టిస్ భన్సల్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎంపీల సెక్యూర్టీ ఏర్పాట్లపై పరిశీలిన చేస్తున్న నేపథ్యంలో.. వీఐపీ సెక్యూర్టీ కల్చర్ గురించి కూడా ఆయన ఆరా తీశారు.
అయితే ఎంపీ హర్భజన్ అంశంలో రెండు ఆదేశాలు ఉన్నట్లు గుర్తించారు. ఓ ఆదేశం ప్రకారం అధికారికంగా 8 మంది సెక్యూర్టీని కేటాయించారు. ఇక ప్రజాధనం నుంచే అదనంగా 15 మంది పోలీసు సిబ్బందిని అనధికారికంగా విధులకు పంపినట్లు కోర్టు గుర్తించింది. ఈ కేసును మళ్లీ మే 20వ తేదీన విచారించనున్నారు. హర్భజన్ సెక్యూర్టీ అంశంలో అనుమానాలు రావడంతో.. మోఘా జిల్లా మొత్తంలో ఎంత మంది పోలీసులు సెక్యూర్టీ విధుల్లో ఉన్నారో తెలుసుకోవాలని జస్టిస్ భన్సల్ ఆదేశించారు.
తన సెక్యూర్టీని అకస్మాత్తుగా తగ్గించారని, తనకు ఉన్న బెదిరింపులను అంచనా వేయకుండా ఆ పని చేశారని, కనీసం తనకు నోటీసు కూడా ఇవ్వలేదని ఎంపీ హర్భజన్ సింగ్ తన పిటీషన్లో పేర్కొన్నారు. పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున హర్భజన్ ఎంపీ అయ్యారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో చేరారు.