న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఉద్యోగులు ఒక సంస్థలో పనిచేస్తూ మరో సంస్థకు సేవలు అందించడం (మూన్లైటింగ్) అనైతికమని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రముఖ ఐటీ కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ స్పష్టం చేసింది. మూన్లైటింగ్కు పాల్పడటమంటే ఉద్యోగ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, గత 6-12 నెలల కాలంలో తమ సంస్థలో ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడిన కొందరిని ఉద్యోగాల నుంచి తొలగించి మిగిలిన ఉద్యోగులందరికీ సందేశం పంపామని పేర్కొన్నది. నిరుటితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికం నికర లాభంలో 33.7%, మొత్తం ఆదాయంలో 31.1% వృద్ధిని నమోదు చేసిన హ్యాపీయెస్ట్ మైండ్స్లో ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి దాదాపు 4,581 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తమ సంస్థలో మూన్లైటింగ్ సమస్య అంత ఎక్కువగా ఏమీ లేదని హ్యాపీయెస్ట్ మైండ్స్ తెలిపినప్పటికీ, అలాంటి చర్యలకు పాల్పడినందుకు ఎంతమందిని తొలగించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మూన్లైటింగ్ను ఆమోదించే ప్రసక్తే లేదని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జోసెఫ్ అనంతరాజు తెలిపారు. ఒక సంస్థలో ఉద్యోగం చేసేందుకు ఒప్పందంపై సంతకం చేయడమంటే పూర్తిగా ఆ సంస్థలో పనిచేసేందుకు ఒప్పుకోవడమేనని, అందుకు విరుద్ధంగా ఇతర కంపెనీలకు కొద్ది గంటలు సేవలు అందించినా అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.