Halwa Ceremony | ఢిల్లీలోని నార్త్బ్లాక్లో బుధవారం హల్వా వేడుక జరిగింది. ఏటా బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ ఉన్నారు. బడ్జెట్కు ముందు ఆర్థిక మంత్రి హల్వా వేడుకను నార్త్బ్లాక్లో గ్రౌండ్ఫ్లోర్లో నిర్వహిస్తూ వస్తుంటారు. హల్వా వేడుక బడ్జెట్ ఖరారైందని, ప్రింటింగ్ వర్క్ మొదలైందని సూచిస్తుంది.
ఈ వేడుకలో బడ్జెట్ తయారు చేసిన అధికారులు, ఉద్యోగులకు కేంద్రమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అయితే, బడ్జెట్ సంబంధించిన అంశాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. బడ్జెట్ను రూపొందించే పనిలో నిమగ్నమైన ఆర్థిక మంత్రిత్వ శాఖలోని బడ్జెట్ విభాగానికి చెందిన అధికారులందరినీ పార్లమెంట్లో బడ్జెట్ను సమర్పించే వరకు వారి కుటుంబాలను సైతం కలిసేందుకు అనుమతించరు. ఆర్థిక మంత్రి అధికారులకు హల్వా వడ్డించారు. బడ్జెట్ను పార్లమెంట్లో ముద్రించే పది రోజుల ముందు ప్రింటింగ్ను ప్రారంభిస్తారు. బడ్జెట్ తయారీలో పాల్గొనే అధికారులు, సిబ్బంది అంతా ఇక్కడే ఉంటారు. అలాగే, ఈ మంత్రిత్వశాఖ అధికారులు, ఉద్యోగులంతా 24గంటలూ ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘాలో ఉంటారు.
ఎవరినీ కలిసేందుకు అనుమతి ఉండదరు. ఫోన్లు వాడేందుకు సైతం అనుమతి ఇవ్వరు. అత్యవసర పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది పర్యవేక్షణలోనే మాట్లాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారి కష్టానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రభుత్వం హల్వా వేడుకను ప్రభుత్వం నిర్వహిస్తుంది. బడ్జెట్ పత్రాల ముద్రణ 1950 వరకు రాష్ట్రపతి భవన్లో కొనసాగింది. అయితే, అదే ఏడాది లీక్ కావడంతో మింటో రోడ్డుకు, ఆ తర్వాత నార్త్ బ్లాక్లోని బేస్మెంట్కు మార్చారు. అప్పటి నుంచి ఈ ప్రింటింగ్ ప్రెస్లో బడ్జెట్ ముద్రణ కొనసాగుతున్నది.