న్యూఢిల్లీ, జనవరి 6: సూర్యుడిపైకి ఇస్రో ప్రయోగించిన ‘ఆదిత్యాస్త్రం’ విజయవంతమైంది! సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసిలోకి పంపిన ఆదిత్య ఎల్1 అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. శాటిలైట్ను తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం చేపట్టిన కీలక విన్యాసం విజయవంతమైంది. గత ఏడాది సెప్టెంబర్ 2న సూర్యుడి దిశగా మొదలైన ఆదిత్య ప్రయాణం, దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న లగ్రాంజ్ పాయింట్ను చేరుకుంది. 126 రోజుల తర్వాత హ్యాలో కక్ష్యలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి అత్యంత కీలకమైన సమాచారం భూమిపైన ఇస్రో కేంద్రానికి ఆదిత్య ఎల్1 పంపనున్నది. సూర్యుడి బాహ్య వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగం ఇది. ఆదిత్య ఎల్1 అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందని తొలుత ప్రధాని మోదీ ఎక్స్లో ప్రకటించారు. ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను ప్రధాని అభినందించారు. ఇస్రో మిషన్లలో మహిళా సైంటిస్టులు గణనీయమైన ప్రాత పోషిస్తున్నారని రాష్ట్రపతి కొనియాడారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ ఆదిత్య ఎల్1 తుది కక్ష్యలో చేరింది’ అంటూ ప్రశంసించారు. ఇస్రో చైర్మెన్ ఎస్ సోమ్నాథ్ మాట్లాడుతూ, ‘ఆదిత్య ఎల్1 నిరంతరం సూర్యుడిపై ఓ కన్నేసి ఉంచుతుంది. దీనివల్ల సౌర తుఫానుల ప్రభావం ముందుగా పసిగట్టి శాటిలైట్స్, భూమిపై విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టవచ్చు’ అని అన్నారు.
ఈ శాటిలైట్లో ఏడు పెలోడ్లు ఉన్నాయి. ఇందులోని పలు డిటెక్టర్లు..సూర్యుడి బాహ్య వాతావరణం (సోలార్ కరోనా), ఫొటో స్పియర్, క్రోమో స్పియర్ను అధ్యయనం చేస్తాయి. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్పై ఆదిత్య ఎల్1 కీలక సమాచారం పంపనున్నది.
భూమి-సూర్యుడి వ్యవస్థలో ఐదు లగ్రాంజ్ పాయింట్స్ వుంటాయి. మిగతా గ్రహాలు, ఉపగ్రహాలకు..సూర్యుడికి మధ్య కూడా ఇవి ఉంటాయి. దీనిని ‘హ్యాలో ఆర్బిట్’ అంటారు. భూమి నుంచి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. లగ్రాంజ్ వద్దకు చేరుకోవడానికి ఆదిత్య ఎల్1కు నాలుగు నెలల సమయం పట్టింది. అమెరికా, యూరప్, చైనా, జపాన్ తర్వాత ఈ ఘనత సాధించిన దేశంగా భారత్ నిలబడింది.
అంతరిక్షంలో సూర్యుడు, భూమి మధ్య ఉండే బలాలు దాదాపు ‘జీరో’ అయిన స్థానాన్నే ‘లగ్రాంజ్’ పాయింట్గా పేర్కొంటారు. ఈ పాయింట్ చుట్టూ ఉండే ‘హ్యాలో ఆర్బిట్’లో ప్రవేశించిన శాటిలైట్ సూర్యుడ్ని నిరంతరం పరిశీలిస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన కాంతి కణాలను, అంతరిక్షంలో వాటి ప్రభావం, శాటిలైట్స్ పనితీరు మొదలైనవి తెలుసుకోవాలన్నది సైంటిస్టుల ఉద్దేశం.
బెంగళూరు, జనవరి 6: భారత్ చేపట్టిన మొట్టమొదటి సోలార్ మిషన్ ‘ఆదిత్య ఎల్1’ ప్రాజెక్ట్కు మహిళా శాస్త్రవేత్త నిగర్ సాజీ నేతృత్వం వహించారు. ఈ మిషన్ సక్సెస్ కోసం ఆమె సారథ్యంలోని సైంటిస్టుల బృందం 9 ఏండ్ల పాటు అహర్నిశలు పని చేసింది. మిషన్ సక్సెస్ అయిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘మహిళా సైంటిస్టులకు ఇస్రోలో ఎలాంటి అడ్డంకులూ లేవు. టాలెంట్కు మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. ఆదిత్య ఎల్1 అత్యంత కష్టతరమై, సవాల్తో కూడుకున్న ప్రాజెక్ట్’ అని అన్నారు. తమిళనాడు టెంకాశి జిల్లాకు చెందిన నిగర్ సాజీ ప్రఖ్యాత సైంటిస్టు మేరీ క్యూరీని స్ఫూర్తిగా తీసుకొని ఇస్రోలో చేరారు.