లక్నో: జ్ఞానవాపి మసీదు(Gyanvapi Mosque)లో ఉన్న శివలింగాన్ని పూజించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అయిదుగురు మహిళలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ బృందానికి చెందిన రాఖీ సింగ్ అనే పిటీషనర్.. ఆ కేసు నుంచి తన పిటీషన్ను విత్డ్రా చేసుకున్నది. ఇథినేషియా ద్వారా తనకు చావును ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రపతికి ఆ మహిళ లేఖ కూడా రాసింది. జ్ఞానవాపిపై కేసు దాఖలు చేసిన అయిదుగురు మహిళల మధ్య విబేధాలు తలెత్తడం వల్లే రాఖీ సింగ్ తన పిటీషన్ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. వేధింపులు తట్టుకోలేక మానసిక క్షోభకు గురవుతున్నానని, అందుకే ఇథినేషియా(Euthanasia) మరణాన్ని కోరుతున్నట్లు ఆమె చెప్పారు. అయితే ఇథినేషియా విషయంలో రాష్ట్రపతి స్పందన కోసం శుక్రవారం వరకు వేచి చూడనున్నట్లు ఆమె తెలిపారు. ఆ తర్వాత తన స్వంత నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు ఆమె వెల్లడించారు.
తోటి పిటీషనర్లు తనను వేధిస్తున్నట్లు ఆ మహిళ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. జ్ఞానవాపి మసీదు కేసులో హిందువుల తరపున పిటీషన్ వేసిన జితేంద్ర సింగ్ విసేన్ బంధువే రాఖీ సింగ్. అయితే తమ కుటుంబం ఆ కేసు నుంచి విత్డ్రా చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భార్య కిరణ్ సింగ్, కోడలు రాఖీ సింగ్ కూడా జ్ఞానవాపి సంబంధిత కేసుల నుంచి విముక్తి కోరుతుఉన్నట్లు విసేన్ చెప్పారు. విశ్వ వేదిక్ సనాతన సంఘం అధిపతి అయిన విసేన్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు.
జ్ఞానవాపిపై కేసు వేయడం పెద్ద తప్పు అని, హిందూ పిటీషనర్లతో పాటు అనేక మంది నుంచి వేధింపులు ఎదురౌతున్నట్లు ఆయన అన్నారు. తన వద్ద పరిమితమైన శక్తి మాత్రమే ఉందని, ఈ ధర్మ పోరాటాన్ని కొనసాగించలేనని, అందుకే తప్పుకుంటున్నట్లు విసేన్ వెల్లడించారు. మతం పేరుతో జిమ్మిక్కులు చేస్తున్న వారి చుట్టే సమాజం తిరుగుతోందని ఆయన ఆరోపించారు.
జ్ఞానవాపి మసీదులో ఉన్న హిందూ విగ్రహాలను ఆరాధించేందుకు అనుమతి ఇవ్వాలని ఆగస్టు 2021లో రాఖీ సింగ్తో పాటు మరో నలుగురు మహిళా పిటీషనర్లు కేసు దాఖలు చేశారు. అయితే ఇప్పుడు ఆ పిటీషనర్ల మధ్య విబేధాలు ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. జ్ఞానవాపి కాంప్లెక్స్లో ఉన్న శృంగార గౌరిని ఏడాదికి ఒకసారి పూచించేందుకు హిందూ మహిళలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.