వారణాసి: ఉత్తర ప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో ఉన్న హిందూ దేవతా విగ్రహాలకు పూజలు 31 ఏండ్ల తర్వాత బుధవారం రాత్రి పునఃప్రారంభమయ్యాయి. వారణాసి జిల్లా కోర్టు తీర్పు అనంతరం భక్తుల ‘హరహర మహాదేవ్’ నినాదాల మధ్య పూజలు మళ్లీ మొదలయ్యాయి. కాశీ విశ్వనాథుని దేవాలయానికి పక్కనే ఉన్న ఈ ప్రాంగణంలో గతంలో వ్యాస్ కుటుంబ సభ్యులు పూజలు చేసేవారు. అదే కుటుంబానికి చెందిన జితేంద్రనాథ్ వ్యాస్ బుధవారం రాత్రి పూజలు చేసి, హారతి ఇచ్చారు.
కాశీ విశ్వనాధుని దేవాలయం ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే మాట్లాడుతూ, వ్యాస్జీ సెల్లార్ను 31 ఏళ్ల తర్వాత పూజల కోసం తెరిచినట్లు చెప్పారు. పూజ, హారతి కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారని తెలిపారు. పూజలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. వారణాసి జిల్లా కోర్టు బుధవారం ఇచ్చిన తీర్పులో, జ్ఞానవాపి మసీదు సెల్లార్లోని హిందూ విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. కాశీ విశ్వనాథుని దేవాలయం ట్రస్ట్ దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపింది. అదే విధంగా ఈ దేవాలయానికి, దానికి ఎదురుగా ఉన్న నందీశ్వరునికి మధ్య ఉన్న బారికేడ్లను తొలగించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.
హైకోర్టులో సవాల్
వారణాసి జిల్లా కోర్టు పూజలకు అనుమతి ఇవ్వడాన్ని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో గురువారం సవాల్ చేసింది. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని కోరినట్లు ఈ కమిటీ తరపు న్యాయవాది ఎస్ఎఫ్ఏ నక్వీ తెలిపారు. జిల్లా కోర్టు తీర్పును అమలు చేయడంలో ఇంత ఆత్రుత ఎందుకని ప్రశ్నించారు. అంతకుముందు ఈ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించి, హైకోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పింది.
పోలీసుల కవాతు
వారణాసిలోని సున్నిత ప్రాంతాల్లో పోలీసులు గురువారం ఫ్లాగ్ మార్చ్ చేశారు. మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.