Delhi | బెంగాల్ దగ్గర గౌహతి- బికనీర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లానని, జరుగుతున్న సహాయక చర్యలను కూడా ఆయనకు వివరించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను వ్యక్తిగతంగా కూడా పరిశీలిస్తూనే వున్నానని అశ్వనీ వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మరోవైపు రైల్వే శాఖ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. మృతులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇక… తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, కొద్దిగా గాయపడిన వారికి 25,000 రూపాయలను ఎక్స్గ్రేషియా ప్రకటించింది రైల్వే శాఖ.
పట్నా నుంచి గౌహతి వెళ్తున్న గౌహతి- బికనీర్ ఎక్స్ప్రెస్ బెంగాల్లోని మైనాగురి దగ్గర పట్టాలు తప్పింది. ఈ సమయంలో రైలు 40 కిలోమీటర్ల వేగంగా వెళుతోంది. దీంతో ఆరు బోగీలు తలకిందులయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. రైలు భారీ కుదుపుకు లోనుకావడంతోనే పట్టాలు తప్పినట్లు తాము ప్రాథమికంగా ఓ నిర్ధరణకు వచ్చామని రైల్వే శాఖ పేర్కొంది.