న్యూఢిల్లీ: ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడంతో వైద్యులు, సిబ్బంది భయంతో అక్కడి నుంచి పారిపోయారు. చనిపోయిన వారి రోగుల బంధువులు దాడి చేస్తారన్న భయంతో వారంతా ఒక చోట దాక్కున్నారు. గుర్గావ్లోని కీర్తి ప్రైవేట్ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఏప్రిల్ 30న ఆ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం అధికారులకు చెప్పారు. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రోగుల బంధువులకు ఆసుపత్రి సిబ్బంది పరిస్థితిని వివరించారు. సీరియస్గా ఉన్న రోగులను వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు.
మరోవైపు ఆక్సిజన్ లేక ఐసీయూ వార్డులోని ఆరుగురు కరోనా రోగులు చనిపోయారు. ఈ విషయం గ్రహించిన వైద్యులు, సిబ్బంది రోగుల బంధువులు తమపై దాడి చేస్తారన్న భయంతో అక్కడి నుంచి పారిపోయి ఒక చోట దాక్కున్నారు. వైద్యులు, సిబ్బంది కనిపించకపోవడం, తమ వారి పరిస్థితి విషమంగా ఉండటంతో రోగుల బంధులు హాహాకారాలు చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. దీంతో వైద్యులు, సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఏప్రిల్ 24న మరణించిన ఒక రోగి బంధువులు వైద్య సిబ్బందిని కొట్టారని, ఆ భయంతోనే తాజాగా సుమారు 20 మంది వైద్యులు, సిబ్బంది తమ రక్షణ కోసం దాక్కున్నారని ఆసుపత్రి డైరెక్టర్ తెలిపారు. పోలీసులు వచ్చిన తర్వాత వారంతా తమ విధులకు హాజరయ్యారని వెల్లడించారు.