రాజౌరి/శ్రీనగర్, అక్టోబర్ 4: జమ్ముకశ్మీర్లోని గుజ్జర్లు, బకర్వాల్, పహాడీలకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఓ సభలో మాట్లాడుతూ ‘ఈ మూడు సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని జస్టిస్ శర్మ కమిషన్ సూచించింది. దీనిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం.
చర్చలు ముగిశాక రిజర్వేషన్లు కల్పిస్తాం’ అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఎస్టీ కోటా కింద గుజర్లు, బకర్వాల్లు రిజర్వేషన్లు పొందుతున్నారు. పహాడీలకు కూడా 4శాతం రిజర్వేషన్ ఉన్నది. దీంతో రిజర్వేషన్ల విషయంలో పహాడీలతో గుజర్లు, బకర్వాల్లకు తరుచుగా గొడవలు జరిగేవి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం జస్టిస్ శర్మ కమిషన్ను ఏర్పాటు చేసింది. అధ్యయనం చేసిన కమిషన్ ఈ మూడు సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు (ఎస్టీ కోటా కింద) కల్పించాలని సూచించింది. దీనిపై ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చిస్తున్నది.
అమిత్ షా పర్యటన నేపథ్యంలో మంగళవారం జమ్ము, రాజౌరి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కొందరు నేతలను గృహనిర్బధంలో ఉంచారు. బారాముల్లా, బుద్గాం మధ్య రైళ్ల రాకపోకలను బుధవారం వరకు నిలిపివేయనున్నట్టు అధికారులు చెప్పారు. భద్రతా కారణాల వల్లే రాకపోకలను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. అమిత్ షా పర్యటన ముగిసేవరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు.