అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఎంఏ విద్యార్హత సర్టిఫికెట్ల బహిర్గతానికి సంబంధించిన కేసు తీర్పును గురువారం గుజరాత్ హైకోర్టు వాయిదా వేసింది. ఇందులో దాచడానికేమీ లేకపోయినా, ఇది ప్రధాని వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని గుజరాత్ యూనివర్సిటీ వాదించింది. కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే.. గుజరాత్ యూనివర్సిటీలో ఎంఏ చదివినట్టు మోదీ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని, అయితే ఈ విషయంలో గందరగోళాన్ని తొలగించేందుకు విద్యార్హతల సర్టిఫికెట్లను ప్రజాబాహుళ్యంలో ఉంచాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర సమాచార కమిషన్ను (సీఐసీ) కోరారు.
ఈ మేరకు సమాచారం అందివ్వాలని సీఐసీ.. గుజరాత్ వర్సిటీని ఆదేశించింది. వర్సిటీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఓ వ్యక్తి అనుమతి లేకుండా అతడి అర్హత సర్టిఫికెట్ల సమాచారం ఇస్తే అది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని చెప్పారు. ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనానికి తావు లేనందున మోదీ ఎంఏ సర్టిఫికెట్ను వెల్లడించాలని యూనివర్సిటీని ఒత్తిడి చేయడం తగదని పేర్కొన్నారు. కాగా కేజ్రీవాల్ న్యాయవాది పెర్సీ కవినా వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి చట్ట ప్రకారం తన విద్యార్హతకు సంబంధించిన వివరాలు వెల్లడించాల్సిందేనని, అందులో దాచడానికేమీ లేదని అన్నారు.