అహ్మదాబాద్, ఫిబ్రవరి 12 : పాఠశాల ప్రాంగణాల్లో ఉండే వీధి కుక్కలపై సర్వే చేయాలంటూ గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఆ రాష్ట్ర ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ.. ఉపాధ్యాయులు తమ పాఠశాల ప్రాంగణాలు, పరిసరాల్లో ఉన్న వీధి కుక్కల వివరాలు సేకరించి పంపాలంటూ ఈ నెల 11న విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీనిని అత్యవసర పనిగా గుర్తించి మూడు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఇప్పటికే విద్యేతర పనులతో విధి నిర్వహణలో సతమతమవుతున్న తమకు ఈ కొత్త బాధ్యత అప్పగించడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలంటూ విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇప్పటికే మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టడం, ప్రభుత్వ కార్యక్రమాలకు జనాన్ని సమీకరించడం, ఎన్నికల డ్యూటీ, సర్ వివరాల సేకరణ వంటి పనులతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి మనీశ్ విమర్శించారు.