అహ్మదాబాద్: ఇప్పుటికే భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గుజరాత్ రాష్ట్రానికి మరో ప్రమాదం పొంచి ఉంది. జూలై 22న (శనివారం) గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, కేవలం ఒక్కరోజులోనే 204.4 మిల్లీమీటర్ల కంటే పైగా వానలు పడే ఛాన్స్ ఉన్నదని భారత వాతావరణ విభాగం (IMD) అధికారులు వెల్లడించారు.
ఈ మేరకు ఐఎండీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. కుండపోత వర్షాల నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్నట్లు అధికారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్లలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్కు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేయడంతో ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.