పటాన్ (గుజరాత్): తాను ప్రేమించిన వ్యక్తితో పారిపోవడానికి యత్నించిన ఓ మైనర్ బాలికకు గ్రామస్థులు అవమానకరమైన శిక్షను విధించారు. ఆమెకు గుండు గీయించి, ముఖానికి నల్లటి రంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటన గుజరాత్లోని పటాన్ జిల్లాలో శుక్రవారం జరుగగా పోలీసులు శనివారం వివరాలను వెల్లడించారు. బాలికతోపాటు ఆమె ప్రియుడిని కూడా ఊరేగించినట్టు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా తమ సామాజిక వర్గం పరువు పోయిందని భావించిన గ్రామస్థులు ఈ చర్యకు దిగినట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి 35 మందిపై కేసు నమోదు చేశామని, 22 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. మరోవైపు తమ బాలికను ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ బాలిక ప్రియుడిపైనా కేసు నమోదైంది.