అహ్మదాబాద్: ఒక మత కార్యక్రమంలో పాల్గొన్న గుజరాత్ మంత్రి, గొలుసులతో తనను తాను కొట్టుకున్నారు. అయితే మూఢ నమ్మకాలను ప్రచారం చేయవద్దంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఆయనపై మండిపడింది. గుజరాత్లోని అధికార బీజేపీ మంత్రి అరవింద్ రాయనీ, రాజ్కోట్ జిల్లాలోని స్వగ్రామంలో గురువారం జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఊగిపోతూ ఇనుప గొలుసులతో తనను తాను కొట్టుకున్నారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, గుజరాత్ మంత్రి అరవింద్ రాయనీ తీరుపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ మండిపడ్డారు. ఆధునిక కాలంలో మూఢ నమ్మకాలను ఆయన ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తి మంత్రిగా ఉండటం ప్రజల దురదృష్టమని దుయ్యబట్టారు.
అయితే బీజేపీ మంత్రి అరవింద్ తన చర్యను సమర్థించుకున్నారు. తన దైవాన్ని తాను కొలుస్తున్నానని, మతపరమైన తన నమ్మకాన్ని మూఢనమ్మకంగా చూడకూడదని అన్నారు. గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి యజ్ఞేష్ దవే కూడా మంత్రిని సమర్ధించారు. విశ్వాసానికి, మూఢనమ్మకాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోవాలని అన్నారు. మత విశ్వాసాలను దెబ్బ తీసే చర్యలకు కాంగ్రెస్ దూరంగా ఉండాలని సూచించారు.