అహ్మదాబాద్ : 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మంది నిందితులకు విధించిన మరణశిక్షను, మరో 11 మందికి విధించిన జీవిత ఖైదును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. ఈ దాడుల్లో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 2022లో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు మంగళవారం ఈ చారిత్రక తీర్పును ప్రకటించింది. ఈ కేసులో మొత్తం 49 మంది నిందితుల్లో 38 మందికి ఉగ్రవాద నిరోధక చట్టం(ఉపా), ఐపీసీ సెక్షన్ 302 కింద మరణ శిక్షను ఖరారు చేయగా, మిగిలిన 11 మందికి చివరి శ్వాస వరకూ జీవితఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు గతంలో తీర్పు నిచ్చింది.
ఈ మరణశిక్ష ధ్రువీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కూడా పరిశీలించిన అనంతరం హైకోర్టు ఈ శిక్షలను సమర్థించింది. ఈ కేసు దర్యాప్తులో నిందితుల ప్రమేయాన్ని గుర్తించడం సవాల్గా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుల్లో డాక్టర్లు, ప్రొఫెసర్లు, కంప్యూటర్ నిపుణులు కూడా ఉన్నారని కోర్టు పేర్కొంది. అయితే దర్యాప్తు అధికారులు పటిష్టమైన ఆధారాలు సేకరించి, న్యాయస్థానానికి సమర్పించారని కోర్టు తెలిపింది. 2008 జూలై 26న అహ్మదాబాద్లోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి, ఎల్జీ ఆస్పత్రి, బస్సులు, పార్కింగ్ స్థలాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి.దేశ చరిత్రలో ఇంత మందికి ఉరిశిక్ష వేయడం ఇది తొలిసారి అని నిపుణులు పేర్కొన్నారు.